భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృధా చేయవద్దు : సీఎం
భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు
- By VamshiLoading...
- | 1 Sept 2024 11:07 AM GMT
X
భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృధా చేయకుండా భవిష్యత్తు అవసరాల కు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచించారు. ఎగువ ప్రాంతల్లో కురిసిన వర్షాలతో పాటు కడెం నుంచి వస్తున్న వరద తో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. దీంతో ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. మరోవైపు ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు లిఫ్ట్ చేయాలని, రోజుకు ఒక టీఎంసీ తగ్గకుండా డ్రా చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నంది, గాయత్రి పంప్ హౌస్ ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి సూచించారు.
మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్తో పాటు రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్ధ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.45 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టు నుంచి ప్రవాహం ఉద్ధృతంగా వస్తుండటంతో నంది, గాయత్రి పంప్ హౌస్ ల ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నారు. మిడ్మానేరు ప్రాజెక్టు సామర్ధ్యం 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15 టీఎంసీలు ఉంది. అక్కడి నుంచి 14 వేల క్యూసెక్కుల కు పైగా లోయర్ మానేరు డ్యామ్కు, మరో 6400 క్యూసెక్కులు అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా రంగనాయక్ సాగర్కు తరలిస్తున్నారు. అటు రంగ నాయక సాగర్ నుంచి నీటిని పంపింగ్ చేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలని.. అక్కడి నుంచి సింగూర్ ప్రాజెక్ట్, నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరకు నీటిని తరలించాలని ఆదేశించారు.
ప్రస్తుతం అన్నపూర్ణ, రంగ నాయక సాగర్ నుంచి 7.52 టీఎంసీ, మల్లన్నసాగర్ లో 50 టీఎంసీ ల కెపాసిటీ. ప్రస్తుతం 11.43 టీఎంసీ ల నిల్వ ఉంది. కొండ పోచమ్మ సాగర్ లో 15 టీఎంసీ ల కెపాసిటీ ఉండగా 7.91 టీఎంసీ నీళ్లున్నాయి.కేంద్ర జల సంఘం మార్గదర్శకాల ప్రకారం మల్లన్నసాగర్,కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో సాధ్యమైనంత వరకు నీటిని నిల్వ చేయాలని చెప్పారు. మల్లన్నసాగర్ లో గరిష్ఠంగా 18 నుంచి 20 టీఎంసీ లు, కొండపోచమ్మ సాగర్ లో 10 టీఎంసీ లు నిల్వ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అన్ని ముందు జాగ్రత్తలు పాటించాలని అప్రమత్తం చేశారు.కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించాలని సీఎం చెప్పారు.