తెలంగాణలో బౌద్ధ పర్యాటక స్థలాల అభివృద్ధి: రేవంత్
హుస్సేన్ సాగర్ చుట్టూ స్కైవాక్ వే ఏర్పాటునకు ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశం
- By RajuLoading...
- | 31 Aug 2024 2:59 PM GMT
X
తెలంగాణలో బౌద్ధ పర్యాటక స్థలాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం ఏర్పాటు చేయాలని, బ్యాక్ వాటర్ వరకు బోటింగ్ను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నది. ఫణిగిరి, నేలకొండపల్లి టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. హుస్సేన్ సాగర్ పరిసరాలను ప్రపంచస్థాయి పర్యాటక హబ్గా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతోపాటు హుస్సేన్ సాగర్ చుట్టూ స్కైవాక్ వే ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.
ట్యాంక్బండ్, తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు వరకు వలయాకారంలో స్కైవాక్ వే డిజైన్ చేయాలని సీఎం తెలిపారు. ఫుడ్కోర్టులు, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. గోల్కాండ చుట్టూ రోడ్లన్నీ ఇరుకుగా ఉన్నందున, వాటిని విశాలంగా అభివృద్ధి చేయాలని, ఆక్రమణలు ఉంటే తొలిగించాలని ఆదేశించారు. అయితే అక్కడి ప్రజలు నిరాశ్రయులు కాకుండా పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్ను పంపింది. బుద్ధవనంలో రూ. 25 కోట్లతో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం, ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కివ్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. వీటితో పాటు అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం ఏర్పాటునూ ప్రణాళికలో పొందుపరచాలని నిర్ణయించింది. నాగార్జునసాగర్ సందర్శను వెళ్లే పర్యాటకులు బ్యాక్వాటర్ వరకు బోట్లో వెళ్లేందుకు ఏర్పాట్లు పునరుద్ధరించాలని నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మించానలి ఆర్ అండ్ బీ శాఖను సీఎం ఆదేశించారు.