రుణమాఫీ గైడ్‌లైన్స్‌తో రైతుల్లో గందరగోళం: నిరంజన్‌రెడ్డి

రుణమాఫీ విషయంలో ప్రభుత్వ గైడ్‌లైన్స్‌తో రైతులు ఆందోళన చెందుతున్నారు. పట్టాదారు పాస్‌ పుస్తకం ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రుణమాఫీ గైడ్‌లైన్స్‌తో రైతుల్లో గందరగోళం: నిరంజన్‌రెడ్డి
X

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని, రైతు భరోసా పథకాన్ని అమలు చేసి, రైతాంగానికి చేయూతనివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రైతుల సంఖ్యను కుదించడానికే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసింది. రుణమాఫీపై ప్రభుత్వ ఉత్తర్వులు గందరగోళంగా ఉన్నాయి. రుణమాఫీ ఆంక్షల గురించి ప్రజలకు ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు. ఆంక్షలు లేవని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. కానీ గైడ్‌లైన్స్‌ ఎక్కడా మార్చలేదు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు తెలుస్తున్నది. 11 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి అంటున్నారు .. మిగిలిన 49 లక్షల మంది రైతుల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. రేషన్‌ కార్డు ఉన్నవాళ్లకే రుణమాఫీ చేస్తామని చెబుతున్నది. మరోవైపు రైతుల గుర్తింపుకే రేషన్ కార్డు అంటున్నారు .. మరి రేషన్ కార్డు లేని రైతుల పరిస్థితి ఏంటి ? కొద్దిమందికి ఇచ్చి సంబరాలు చేాయాలని ప్రభుత్వం భావిస్తున్నది. రైతుకు సాయం విషయంలో వర్గీకరణ, ఆంక్షలు విధించవద్దు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన రుణాల పరిస్థితి ఏంటి ? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని నిరంజన్‌ డిమాండ్‌ చేశారు. రెండు లక్షల వరకు ఉన్న రుణాలు అన్నీ ప్రభుత్వం మాఫీ చేయాలి. రెండు లక్షలకు పైగా ఉంటే ఆ మిగిలిన మొత్తాన్ని రైతు కడితేనే ఇస్తామనడం కాలయాపన చేయడమే అన్నారు. వ్యవసాయం చేయకుండా పట్టాదారు పాస్ బుక్ కలిగి ఉండి రైతుబంధు పొంది ఉన్నట్లయితే .. అదే పాస్ బుక్ తో రుణం కూడా తీసుకుని ఉంటాడు కదా ? మరి ఏ కారణాలతో రైతు భరోసా నిలిపివేస్తున్నారు ? రుణమాఫీ చేసినట్లే రైతుభరోసా కూడా అమలు చేయాలి . కనీసం ఐదెకరాల వరకు ఉన్న రైతులకన్నా రైతుభరోసా ఇవ్వండి అని కోరారు. రుణమాఫీకి పట్టదారు పాస్ బుక్కును ప్రామాణికంగా తీసుకుంటే రైతుభరోసాకు కూడా దానినే ప్రామాణికంగా తీసుకుని ఇవ్వాలన్నారు.

అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చారు .. అధికారం వచ్చిన తర్వాత అప్పులు, వడ్డీలు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు

తెలంగాణ ఏర్పాటును ఆఖరు నిమిషం వరకు అడ్డుకుని వందల మంది బలిదానాలకు కారణం అయిన చంద్రబాబు నాయుడు కూడా పదేళ్లలో తెలంగాణ దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా ఎదిగిందని ఒప్పుకున్నారు. కానీ రేవంత్‌ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకుండా కొండలు, గుట్టలు అంటూ ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేస్తున్నది. రైతుభరోసా ఎగ్గొట్టి రుణమాఫీకి నిధులు మళ్లిస్తున్నారని ఆరోపించారు. రూ.40 వేల కోట్లు ఏకబిగిన మాఫీ చేస్తాం అన్నారు ... తర్వాత రూ.31 వేల కోట్లు అని అన్నారు.

ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నాడు లేని ఆంక్షలు నేడు ఎందుకు ? అని ప్రశ్నించారు. పట్టాదారు పాస్ బుక్ ప్రామాణికంగా రుణమాఫీ చేయాలి. అనర్హులు ఉంటే ప్రభుత్వం ఏరి వేసుకోవచ్చు. షరతులు లేని రుణమాఫీ జరగాలన్నారు. గత ప్రభుత్వం రెండు విడతలలో రూ.29 వేల కోట్లు రుణమాఫీ చేశాం .. ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేశామని గుర్తు చేశారు. మా ప్రభుత్వంలో రూ.6 వేల కోట్ల రుణాలు మాత్రమే మిగిలిపోయాయి .. ఆంక్షలు లేకుండా రైతులకు పథకాలు అమలు చేశామన్నారు. లక్ష వరకు ఎంత మంది ? రెండు లక్షల వరకు ఎంత మంది రైతులు రుణాలు తీసుకున్నారో ప్రభుత్వం వెల్లడించాలి అన్నారు.

కరంటు లేక, నీళ్లు లేక రైతాంగం నానాయాతన పడుతున్నారు .. క్రిష్ణా బేసిన్ లో ఇప్పటి వరకు నీళ్లు రావడం లేదు. ఈ సమయంలో రైతులకు రైతుభరోసాతో చేయూతనిస్తే వారు దైర్యంగా వ్యవసాయం చేసుకుంటారు. వ్యవసాయం బలపడితే, స్థిరపడితే అన్నదాతలు వేల మందికి ఉపాధినిస్తారని పదేళ్ల కేసీఆర్ పాలనలో అన్నదాతలకు అండగా నిలిచాం. రైతుబంధు, రైతుబీమా, సాగునీళ్లు, ఉచిత కరంటు, పంటల కొనుగోళ్లు చేసి రైతులలో ఆత్మవిశ్వాసం నింపాం. లక్ష 20 వేల మంది రైతు కుటుంబాలకు రూ.600 కోట్ల పైచిలుకు రైతుబీమా అందించాం. 2014 లో కోటీ 31 లక్షల ఎకరాలలో ఉన్న సాగును 2 కోట్ల 38 లక్షల ఎకరాలకు పెంచాం. 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న ధాన్యం ఉత్పత్తిని దాదాపు 3 కోట్ల టన్నులకు పెంచుకున్నాం. రూ.లక్ష 33 వేల కోట్లతో 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం.ఏటా రూ.10,500 కోట్ల సబ్సిడీ భరిస్తూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు అందించాం.

పదవిచ్చిన ప్రజలను వదిలేసి పదవులు ఉన్న నాయకులను చేర్చుకుంటున్నారు. ఆయారం, గాయారం అనే పదం వచ్చిందే కాంగ్రెస్ పార్టీ వల్ల అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ కట్టిన రైతువేదికలు ఈ రోజు కాంగ్రెస్ వేడుకలకు పనికివస్తున్నాయి. ఆనాడు వ్యతిరేకించిన రైతువేదికలు, కాళేశ్వరం, సచివాలయాలు నేడు కాంగ్రెస్ పార్టీకి దిక్కయ్యాయి అన్నారు. అధికారం కోసం నిరుద్యోగులను వాడుకుని నేడు వారి మీద నిర్భంధం విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పు కోసం చేయిచాచని అన్నదాత కోసం పదేళ్లు పనిచేశాం. కానీహామీల అమలుకు కాంగ్రెస్ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నదనిపథకాలు ఎగ్గొట్టేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.

Raju

Raju

Writer
    Next Story