సీఎం రేవంత్‌కు తెలంగాణ సోయి లేదు.. ఆయన వలసవాద పుత్రుడు: దేశపతి

తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రైఫిల్ పట్టుకుని బయలుదేరాడు. ఆయన సీఎం అయ్యాక జై తెలంగాణ నినాదం మసక బారిపోయింది. జై తెలంగాణ స్థానంలో జై సోనియా, జై కాంగ్రెస్ నినాదాలు తెచ్చారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ విమర్శించారు.

సీఎం రేవంత్‌కు తెలంగాణ సోయి లేదు.. ఆయన వలసవాద పుత్రుడు: దేశపతి
X

దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటుంటే ..ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ స్వాభిమానం మీద దాడి చేస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదు. ఆయన వలసవాద పుత్రుడని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్‌, జి .దేవీ ప్రసాద్‌లతో కలిసి మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రైఫిల్ పట్టుకుని బయలుదేరాడు. ఆయన సీఎం అయ్యాక జై తెలంగాణ నినాదం మసక బారిపోయింది. జై తెలంగాణ స్థానంలో జై సోనియా, జై కాంగ్రెస్ నినాదాలు తెచ్చారని విమర్శించారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ అధికార చిహ్నంలోని చార్మినార్ ,కాకతీయ తోరణాలను రాచరిక చిహ్నాలని హేళన చేశారు. మరోసారి తెలంగాణ స్వాభిమానాన్ని దెబ్బతీయడానికి తెలంగాణ సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతుండటం ముమ్మాటికీ మన అస్తిత్వం పై దాడేనని మండిపడ్డారు.

దేశ స్వాతంత్ర ఉద్యమంలో భరత మాత ఓ ప్రేరణ గా ఉంటే తెలంగాణ ఉద్యమం లో తెలంగాణ తల్లి ప్రేరణగా ఉన్నది.అనేక చర్చల తర్వాతే తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించాం. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ కు నివాళిగా తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టాం. ఆయన రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పడింది. అందుకేసచివాలయానికి ఆయన పేరు పెట్టామని తెలిపారు. సచివాలయం ఎదురుగా అమరజ్యోతి భవనం ఏర్పాటు చేసింది నిత్యం అమరులస్ఫూర్తిగా పాలన జరగాలనే ఉద్దేశంతోనే అన్నారు. అందుకే సచివాలయం,అమరజ్యోతి మధ్య ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహమేనని వ్యక్తుల విగ్రహం కాదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కోరుకుంటుంటే.. అధిష్టానం మెప్పు కోసం రేవంత్ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటున్నారు. కావాలంటే రాజీవ్ గాంధీ విగ్రహాలు బయట ఎన్నైనా పెట్టుకోవచ్చని సచివాలయం ముందు పెట్ట కూడదన్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహం కావాలా రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కావాలా ప్రజలు తేల్చుకోవాలన్నారు.

తెలంగాణ బిడ్డ అప్పటి సీఎం అంజయ్య ను రాజీవ్ గాంధీ అవమానించారు. ఆయనకు జరిగిన అవమానం నుంచే ఒక పార్టీ పుట్టింది ..ఆ పార్టీలో నుంచి వచ్చిన వాడే రేవంత్ రెడ్డి. సోనియా కైనా తెలంగాణ తో సంబంధం ఉన్నదని.. రాజీవ్ గాంధీకి తెలంగాణ కు ఏం సంబంధం ?వారి విగ్రహం పెట్టే ముందు తెలంగాణ మేధావులతో ఏమైనా చర్చలు జరిపారా ? అని ప్రశ్నించారు. ఈ విషయంలో కనీసం కోదండరాం ,హరగోపాల్ ,అందె శ్రీ ల అభిప్రాయాలను తెలుసుకోండని సూచించారు. ఆ ముగ్గురు కూడా రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ వద్దని రేవంత్ కు చెబితే మంచిది అన్నారు. కాబట్టి సీఎం ఇప్పటికైనా తన ఆలోచన మానుకుకొని రాజీవ్ గాంధీ విగ్రహం స్థానం లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని దేశపతి డిమాండ్‌ చేశారు. లేదు రాజీవ్ విగ్రహం పెట్టాలని మొండికేస్తే తెలంగాణ లో అలజడి మొదలవుతుందని, తాము కార్యాచరణ ప్రకటించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేయడం మానండి . గతంలో కాంగ్రెస్ తీరు వల్లే ప్రాంతీయపార్టీలు పుట్టుకొచ్చాయి. మళ్ళీ తెలంగాణ అస్తిత్వంపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదే దాడిని కొనసాగిస్తున్నది.గతంలో ఏపీ సచివాలయం ముందు తెలుగు తల్లి విగ్రహం ఉండేది ..కనీసం ఆ స్ఫూర్తితోనైనా తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్నారు.

కేసీఆర్ పేరు రేవంత్ చెరిపేస్తే చెరిగిపోయేది కాదు

దేవీప్రసాద్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ విగ్రహానికి పాలన కేంద్రమైన తెలంగాణ సచివాలయానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు.సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం తెలంగాణ ప్రజల మనసు గాయపరచడమే అన్నారు. తక్షణమే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిందేనని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్ పదేపదే వై ఎస్ ,చంద్రబాబు పేర్లు ప్రస్తావిస్తున్నారని..తెలంగాణ అభివృద్ధిలో ప్రాంతేతరుల పాత్ర ఉంది కానీ కేసీఆర్ పాత్ర లేదట. కేసీఆర్ చేసిన మంచిని చెప్పడానికి రేవంత్ కు నోరు రావడం లేదని, దీన్నిబట్టే ఆయన తెలంగాణ వ్యతిరేక వైఖరి తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పేరు రేవంత్ చెరిపేస్తే చెరిగిపోయేది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకుల ప్రభుత్వం గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. కాలయాపన కోసమే 15 కేబినెట్ సబ్ కమిటీలు వేశారని విమర్శించారు. తెలంగాణ తల్లిని తీసేస్తే కేసీఆర్ పేరును తీసేసినట్టేనని రేవంత్ భావిస్తున్నట్టున్నారు. అన్ని అవమానాలకు లెక్క కడుతున్నాం. నిన్న కూడా మెదక్ జిల్లాలో స్వాతంత్ర వేడుకల ఆహ్వానపత్రిక లో ప్రతిపక్ష నేత కేసీఆర్ ను అవమానపరిచారు. అన్నివర్గాల నుంచి నిరసన వచ్చే సరికి మళ్ళీ ఆహ్వాన పత్రికను మార్చారు. భాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని దేవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

అస్తిత్వంపై దాడి చేస్తే ఊరుకోం

పల్లె రవికుమార్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ సచివాలయం ముందు అనుమతించేది లేదన్నారు. తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేయాలని లేకపోతే ప్రజల ధర్మాగ్రహం తప్పదని హెచ్చరించారు.

Raju

Raju

Writer
    Next Story