హరిత హోటల్స్లో ఐటి ఉద్యోగులకు 15 శాతం డిస్కౌంట్ : మంత్రి జూపల్లి
తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, తగు ప్రాచుర్యం కల్పించి ప్రోత్సహిస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
- By VamshiLoading...
- | 13 Aug 2024 1:30 PM GMT
X
తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, తగు ప్రాచుర్యం కల్పించి ప్రోత్సహిస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.హైటెక్ సిటీ రహేజా మైండ్ స్పేస్ లో ఐటీ ఉద్యోగులతో మంత్రి జూపల్లి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులకు డిస్కౌంట్ కూపన్ను ఆయన లాంచ్ చేశారు. పర్యాటక అభివృద్ధికి చేయూతనివ్వాలని వారిని కోరారు. టూరిజం ప్రమోషన్ లో భాగంగా మైండ్ స్పేస్ లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులకు హరిత హోటల్స్ లో 15 శాతం డిస్కౌంట్ అవకాశం కల్పిస్తున్నామని, దీన్ని మరిన్ని ఐటీ కంపనీ ఉద్యోగులకు విస్తరిస్తామని ప్రకటించారు. స్కాన్ కోడ్ లో రిజిస్టరైన ఐటీ ఉద్యోగులు ఈ డిస్కౌంట్ కూపన్ను వినియోగించుకోవచ్చని తెలిపారు.
పర్యాటకులను ఆకర్శించేందుకు తానే స్వయంగా సేల్స్ మెన్ అవతారం ఎత్తి ఇక్కడకు వచ్చానని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి – సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమని, చరిత్ర, వారసత్వ సంపద, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు, జలవనరులు, సెలయేర్లు, దేవాలయాలు, ఎకో టూరిజం, ట్రైబల్ టూరిజం, ట్రైబల్ సంసృతి, మెడికల్ టూరిజం లాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని వివరించారు. ఇన్ని వైవిద్యమైన ప్రదేశాలు ఉన్న తెలంగాణ ప్రాంత పర్యాటక రంగం కనీస ప్రచారానికి కూడా నోచుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తెలంగాణ పర్యాటకాన్ని కొత్తపుంతలు తొక్కించబోతున్నామని, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్శించేందుకు ఆధునిక మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.
యాంత్రిక జీవన విధానం నుంచి బయటపడేందుకు పాశ్చత్య దేశీయులు వారంతాల్లో మానసికోల్లాసం, ఆట విడుపు కోరుకుంటారని తెలిపారు.దేశ వ్యాప్తంగా వివిధ విమనాశ్రయాలు, రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాల్లో తెలంగాణ పర్యాటక ప్రాంతాల ప్రదర్శించి.. విస్తృత ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే పర్యాటక శాఖ కొత్త వెబ్ సైట్ ను లాంచ్ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి వాణిప్రసాద్, పర్యాటక శాఖ సంచాలకులు ఇలా త్రిపాఠి, రహేజా గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోనే శ్రవణ్ కుమార్, హైదరాబాద్ సాప్ట్వేర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ మెంబర్ బిపిన్ చంద్ర, ఐటీ ప్రమోషన్ అమరనాథ్ రెడ్డి, ఐటీ ఐద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.