కువైట్ అగ్నిప్రమాదం.. మృతదేహాలు బాధిత కుటుంబాలకు అప్పగింత
కువైట్లోని అల్ మంగాఫ్ బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో చనిపోయిన వారిలో 45 మంది భారతీయులుగా గుర్తించారు. వారి మృతదేహాలను శుక్రవారం బాధిత కుటుంబాలకు అప్పగించారు.
- By RajuLoading...
- | 14 Jun 2024 10:15 AM GMT
X
కువైట్లోని అల్ మంగాఫ్ బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 49 మంది కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో 45 మంది భారతీయులుగా గుర్తించారు. ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. ఆ విమానం శుక్రవారం భారత్కు చేరుకుంటుందన్న సమాచారంతో బాధిత కుటుంబాలన్నీ ఎయిర్పోర్ట్కు వచ్చాయి. దీంతో అక్కడి వాతావరణమంతా ఉద్విగ్నంగా మారిపోయింది. కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సరేంద్రన్ సహా పలువురు విమానాశ్రయానికి వచ్చి మృతులకు నివాళులు అర్పించారు. అనంతరం మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించారు.
ఈ ఘటన జరిగిన తర్వాత సమాచారం అందుకున్న భారత ప్రభుత్వం మృత దేహాలను తరలించడానికి గురువారం వాయుసేన విమానాన్ని పంపింది. అక్కడి పరిస్థితులను పర్యవేక్షించి మృత దేహాలను సాధ్యమైనంత తర్వగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ను అక్కడికి పంపింది. చనిపోయిన వారిలో 23 మంది కేరళ వాసులు కాగా, ఏడుగురు తమిళనాడుకు చెందిన వారున్నారు.