ఐదేళ్ల కనిష్ఠానికి ద్రవ్యోల్బణం
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల కనిష్ఠానికి చేరింది. జులై నెలలో 3.54 శాతంగా నమోదైంది. ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతానికి దిగువకు చేరడం ఇదే మొదటిసారి.
- By RajuLoading...
- | 13 Aug 2024 3:26 AM GMT
X
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల కనిష్ఠానికి చేరింది. జులై నెలలో 3.54 శాతంగా నమోదైంది. ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతానికి దిగువకు చేరడం ఇదే మొదటిసారి. ఆహార పదార్థాల ధరలు తగ్గడమే దీనికి కారణం. ఈ మేరకు సోమవారం కేంద్ర గణాంక కార్యాలయం సమాచారాన్ని వెల్లడించింది.
వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూన్ నెలలో 5.08 శాతంగా నమోదు కాగా.. గత ఏడాది జులైలో 7.44 శాతంగా ఉన్నది. చివరిసారిగా 2019 సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం 4 శాతం దిగువన ముగిసింది. జూన్లో ఆహారపదార్థాల ద్రవ్యోల్బణం 9.36 శాతం ఉండగా.. జులై నాటికి 5.42 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణ సూచీని ఆహారపదార్థాల ధరలే సగానికి పైగా ప్రభావితం చేస్తున్నాయి.
ఇటీవల ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆహారపదార్థాల ధరల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో వాటి ధరలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. అలాగే కూరగాయల ధరలు కూడా 29.32 నుంచి 6.83 శాతానికి తగ్గినట్లు గణాంక కార్యాలయం పేర్కొన్నది. గడిచిన కొన్ని నెలలుగా కీలక వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయికి చేరిన వేళ ఈ డేటా వెలువడం ప్రాధాన్యం సంతరించుకున్నది. దీని ఆధారంగానే ఆర్బీఏ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది.