భారీ వర్షాలు, వరదల మృతుల లెక్కలు ఎందుకు దాస్తున్నరు
సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తి మృతిచెందిన వారి వివరాలను ప్రభుత్వం ఎందుకు దాచి పెడుతోందని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్' వేదికగా ప్రశ్నించారు. వరదలతో మృతి చెందిన వారి గురించి ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా ఒక్క మాట ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. వరదల కారణంగా 31 మంది మృతి చెందారని, వారి వివరాలను బీ ఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ముందు ఉంచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 16 మంది మాత్రమే మృతి చెందినట్లు చెబుతోందని, మృతుల సంఖ్య అంతే అని ఏ విధంగా నిర్ధారణకు వచ్చారో ప్రజలందరికీ సమాధానం చెప్పాలన్నారు. భారీ వర్షాలు, వరదలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతోనే ఇంత మంది చనిపోయారని అన్నారు. ప్రతి మృతుడి వివరాలు ప్రజలకు చెప్పాలని, రేవంత్ రెడ్డి గతంలో హామీ ఇచ్చినట్టుగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.