అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు : హరీశ్ రావు
తెలంగాణ శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. బడ్జెట్పై సాధారణ చర్చ ముగియగానే సభను ఈ నెల 29వ తేదీకి సభ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్హాట్గా నడిచాయి. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి , మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. బడ్జెట్పై సాధారణ చర్చ ముగియగానే అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. దీంతో మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షానికి మైక్ కూడా ఇవ్వకుండా, క్లారిఫికేషన్ కూడా తీసుకోకుండా సభను వాయిదా వేసుకొని పారిపోయారు. ఇది చాలా దుర్మార్గమని హరీశ్ రావు పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ఉదయం పథకం ద్వారా రాష్ట్రం మీద బలవంతంగా 9వేల కోట్లు రుద్దింది అని చెప్పాను. మీటర్లు పెడుతున్నట్లు సంతకాలు పెట్టినం అని వెంటనే సీఎం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు.
సీఎం రేవంత్ చెప్పిన నోట్ జనవరి 4,2017 నాటిది. ఇందులో ఏముందంటే వ్యవసాయ బోరు బావుల కాడ స్మార్ట్ మీటర్లు పెట్టాలనే ముచ్చట ఉంది తప్ప, మీటర్లు అనే ముచ్చటే ఇందులో లేదని పేర్కొన్నారు. నాలుగేళ్లు తీసుకుంటే రాష్ట్రానికి 30వేల కోట్లు వచ్చేవి. కాని రైతుల ప్రయోజనాల కోసం మేం అందుకు ఒప్పుకోలేదు. ఆనాడే 30వేల కోట్లు వదులుకున్నమని క్లారీటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి మాత్రం సభను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేశారన్నారు. నేను చెప్పింది ఒకటి సీఎం మాట్లాడింది ఒకటిన్నారు. మంద బలం ఉందని రేవంత్ రెడ్డి తప్పుగా చెబుతున్నారు. బోడి గుండుకు మోకాలుకు లింక్ పెట్టారని హరీశ్ రావు వెల్లడించారు. సభా నాయకుడు అని మాట్లాడి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్నరేమో అనుమానంగా ఉంది. ఇప్పటికీ మేము కనీసం స్మార్ట్ మీటర్ కూడా పెట్టలేదు. రైతులు ప్రయోజనాలే మాకు ముఖ్యమని హరీశ్ రావు అన్నారు.