మహాసంకల్పం నెరవేరిన రోజు..మరో స్వప్నం సాకారమైన క్షణం: కేటీఆర్
ఖమ్మం జిల్లాలో కరువును శాశ్వతంగా రూపుమాపడానికి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైంది. దీనిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశారు.
సీతారామ ప్రాజెక్టు ను చేపట్టి ఖమ్మం జిల్లాను కరవును శాశ్వతంగా పారదోలడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాణం పోశారని ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 10 లక్షల ఎకరాల్లో పచ్చిన పంటలు పండటానికి కేసీఆర్ బాటలు వేశారు. శంకుస్థాపన చేసిన నాటి నుంచి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయడానికి పటిష్ట ప్రణాళికలను రూపొందించిన యుద్ధప్రాతిపదిక పనులు జరిగేలా చేశారు. ఆ ప్రాజెక్టు ట్రయల్ రన్ ఈరోజు విజయవంతమైంది.
దీనిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. కేసీఆర్ మహా సంకల్పం నెరవేరిన రోజు, మరో స్వప్నం సాకారమైన క్షణమిది అన్నారు. సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయి ఆనాడే కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు త్వరలోనే రైతుల పొలాల్లో పారనున్నాయని.. ఖమ్మం జిల్లాలో ప్రతి ఇంచుకు ఢోకా లేదని, దశాబ్దాల పాటు దగాపడిన రైతుకు ఇక చింతలేదన్నారు.
కాలమైనా.. కాకపోయినా పరవళ్లు తొక్కుతున్న ఈ ప్రాజెక్టు అందించే జలాలతో ఖమ్మం రైతుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండుతాయన్నారు. కేసీఆర్ కలను సాకారం చేసి, ఈ 'జల విజయం'లో భాగస్వాములైన నీటిపారుదల అధికారులను, సిబ్బందిని అభినందించారు . కష్టపడిన ప్రతి ఒక్కరికీ కేటీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పారు