కాంగ్రెస్లో ఉండి బీజేపీ అజెండాను అమలు చేస్తున్న రేవంత్: హరీశ్రావు
సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. బీజేపీ పంచన చేరి, మోడీ శరణు చొచ్చింది రేవంత్ కాదా? అని ప్రశ్నించారు.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని, మెదక్లో బీజేపీని బీఆర్ఎస్ గెలిపించిదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఢిల్లీలో సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాటలు సరికాదన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉంటే వాటిలో మూడు చోట్ల బీఆర్ఎస్ మెజారిటీ సాధించిందని, రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలోనూ బీఆర్ఎస్ మెజారిటీ సాధించిందని హరీశ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సీఎం సొంత గ్రామం కొండారెడ్డి పల్లిలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. రేవంతే అక్కడ బీజేపీకి కాంగ్రెస్ ఓట్లు మళ్లించారా? ఆయన సొంత నియోజకవర్గమైన మహబూబ్ నగర్ లో బీజేపీఎలా గెలిచింది. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. వారంతా కలిసి బీజేపీని గెలిపించారా? కొడంగల్ లో రేవంత్ రెడ్డి 32 వేల మెజారిటీతో గెలిచారు. పార్లమెంటు ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 21 వేల మెజారిటీ మాత్రమే వచ్చింది. మిగతా ఓట్లను ముఖ్యమంత్రి బీజేపీకి వేయించారా? ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో బీజేపీకి భారీ మెజారిటీతో ఎలా గెలిచింది? ఈ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ బీజేపీని గెలిపించిందా? అని హరీశ్ ప్రశ్నించారు.
బీజేపీ పంచన చేరింది, మోడీ శరణు చొచ్చింది, కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ అజెండా అమలు చేస్తున్నది రేవంత్ రెడ్డే అని ఆరోపించారు.నిండు సభలో మోడీని పెద్దన్న అని సంబోధించింది సీఎం కాదా అని ప్రశ్నించారు. మోడీ, రేవంత్ రెడ్డి కుమ్మక్కై సింగరేణని ప్రైవేటు పరం చేస్తున్నారు. అందుకే విభజన హామీలపై సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం లేదన్నారు. రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ శక్తి అయిన బీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయి. అలాంటిది బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.