హైదరాబాద్లో శాంతి భద్రతలు పూర్తిగా విఫలం..అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఫైర్
హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ధ్వజమెత్తారు. రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ధ్వజమెత్తారు. అసెంబ్లీ బడ్జెట్ చర్చల్లో భాగంగా నేడు ఓవైసీ మాట్లాడారు. హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ సమస్య గురించి నిన్న నేను, హరీష్ రావు మాట్లాడితే రిప్లై ఇచ్చిందని పేర్కొన్నారు. మళ్లీ నగరంలో 3 హత్యలు చోటు చేసుకున్నాయని తెలిపారు.హైదరాబాద్లో అన్ని పోలీస్ స్టేషన్లకు లంచాలు వెళ్తున్నాయి అని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. ఒక ఏసీపీ తనకు ఫోన్ చేసి మీ ఏరియాలో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డబ్బులు సాయం చేయమని అడిగితే, నేనెందుకు ఇవ్వాలి మీకు లంచాలు వస్తున్నాయి కదా దానితో కట్టండి అని చెప్పాను అన్నారు. రాష్ట్రంలో హోం మంత్రి లేకపోవడంతో విచ్చలవిడిగా పోలీసులు లంచాలు అడుగుతున్నారని ఆరోపించారు.
హైదరాబాద్లో పోలీసులు రాత్రిపూట డ్యూటీలు చేస్తూ పగటి పూట పడుకుంటున్నారని ఆరోపించారు. దాంతో హత్యలు పగటిపూట జరుగుతున్నాయి అన్నారు. సీఎం రేంత్ రెడ్డి వెంటనే హోం మంత్రిని నియమించాలని అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. సామాన్యులపై లాఠిచార్జ్ చేయడం కాకుండా క్రిమినల్స్, గంజాయి తరలించేవారని కొట్టాలని సూచించారు. హైదరాబాద్లో ఫ్రెండ్లీ పోలిసింగ్ లేదు. కనిపించిన వారిని కనిపించినట్టే కొడుతున్నారు. క్రిమినల్స్ను మాత్రం పట్టుకోవడం లేదు. వారిని శిక్షించడం లేదు. గంజాయి, డ్రగ్స్ తరలిస్తున్న వారి పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. సామాన్యులపై మాత్రం జులుం ప్రదర్శిస్తున్నారని ఓవైసీ తెలిపారు.