ఓల్డ్ సిటీలో ఆక్రమణలు కూల్చే దమ్ముందా?

సీఎం రేవంత్ రెడ్డికి బీజేఎల్ పీ నేత మహేశ్వర్ రెడ్డి సవాల్

Update: 2024-08-26 18:01 GMT

ఓల్డ్ సిటీలో ఆక్రమణలను కూల్చేసే దమ్ముందా అని సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డికి దూకుడు ఎక్కువ అని, ఆ దూకుడే ఆయనకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. చెరువు కబ్జా చేసి ఓవైసీ కాలేజీ నిర్మించారని, ఆ కాలేజీని కూలుస్తారా అని నిలదీశారు. ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే వాటి నుంచి పక్కదారి పట్టించడానికే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను అడ్డం పెట్టి కూల్చివేతలకు తెరతీశారన్నారు. రుణాలు మాఫీ కాక రైతులు ఇబ్బంది పడుతున్నారని, వ్యవసాయ శాఖ అధికారుల వద్దుకు వెళ్లినా, బ్యాంకులకు వెళ్లినా వారికి ఎలాంటి భరోసా దక్కడం లేదన్నారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి ఒకలా.. మంత్రులు మరోలా మాట్లాడి ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నారని అన్నారు. రూ.31 వేల కోట్లు మాఫీ చేశామని సీఎం చెప్తుంటే.. మంత్రులు రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయని.. ఇంకా రూ.12 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉందని చెప్తున్నారని గుర్తు చేశారు. ఈ కేబినెట్ లో ఒక ఫేక్ మంత్రి ఉన్నారని మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఫేక్ మంత్రి ప్రచారం ఇంకోరకంగా ఉందని మండిపడ్డారు.

Tags:    

Similar News