కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాల నిర్వీర్యం : వాసుదేవరెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, బాలరాజుయాదవ్ ఆరోపించారు.
గురుకులాల్లో ఇప్పటి వరుకు 38 మంది విద్యార్ధులు మృతి చెందారని కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, బాలరాజుయాదవ్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. గురుకులాల్లో సమస్యలు తిష్ట వేశాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైడ్రాతో హైడ్రామా సృష్టించారని పేర్కొన్నారు.
రైతు రుణ మాపీని డైవర్షన్ చేయడానికి సీఎం హైడ్రాను తెర మీదకు తెచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్య, వైద్యం పక్కన పెట్టి రేవంత్రెడ్డి బుల్డోజర్ పాలన తెచ్చారని మండి పడ్డారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ జోన్లో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఉందని, అన్ని ఆధారాలు ఉన్నాయని ముందు అది కూల్చండి అని డిమాండ్ చేశారు. సీఎంకు కూడా వట్టినాగులపల్లిలో అక్రమ ఫార్మ్హౌజ్ ఉందని, దానిని కూల్చాలని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రాజకీయ దురుద్దేశంతో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు.