బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనల మధ్య.. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం
శాసనసభ రేపటికి వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం గురువారం ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశం అయ్యేందుకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన, నిరసనల మధ్య దవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ సభని రేపటికి వాయిదా వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ తన కామెంట్స్ని వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికు క్షమాపణలు చెప్పాలని పోడియం ఎదుట బీఆర్ఎస్ సభ్యుల నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక సభలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ సబిత సీఎం రేవంత్ను నిలదీశారు. ఇక సీఎం మాటలకు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు కూడా వంతపాడారు.
గందరగోళ పరిస్థితుల నడుమ సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.మళ్లీ తిరిగి సభ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ప్రారంభమైంది. సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుపట్టారు. స్పీకర్ వినిపించుకోకుండా అధికార సభ్యుడు గడ్డం వివేక్కు అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియంలోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. సబితకు మైక్ ఇచ్చేందుకు సుముఖంగా లేని ప్రభుత్వం.. చివరకు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించుకుంది. అనంతరం సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.