ఆడబిడ్డల ఆందోళన కన్నా కొత్త జూ నిర్మాణమే ఎక్కువా?
ముఖ్యమంత్రి తీరుపై మండిపడ్డ కేటీఆర్
తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని పాలమాకులు గురుకుల ఆడబిడ్డలు వీధుల్లో పోరాటాలు చేస్తుంటే హైదరాబాద్ లో మరో జూ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని.. విద్యార్థినుల సమస్యల కన్నా జూ నిర్మాణమే ఎక్కువైందా అని 'ఎక్స్' వేదికగా కేటీఆర్ సీఎం రేవంత్ తీరుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గురుకులాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఎందుకు వారిని శిక్షిస్తున్నారని ప్రశ్నించారు. విధ్వంసకర రాజకీయాలు మాని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఇవ్వడంపై దృష్టి సారించాలన్నారు. పాలమాకుల గురుకులం సందర్శించి విద్యార్థినులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన తమ పార్టీ నాయకులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.