ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి : రాకేశ్ రెడ్డి

అన్నం పెట్టే వాడికి సున్నం పెట్టడం కాంగ్రెస్ డిఎన్ఏ లోనే ఉందని బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు

By :  Vamshi
Update: 2024-06-20 10:35 GMT

మెగా డీఎస్సీలో 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రూప్-2లో 783 పోస్టులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని..మరో 2 వేల పోస్టులును పెంచాలన్నారు. గ్రూప్-3లో మరో 3 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం చేతకాదని.. ఆయన పీఆర్ స్టంట్లలో బిజీగా ఉన్నారని రేకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు.. జీవో 46పై సీఎస్‌కు ఫిర్యాదు ఇవ్వాలని వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు. గోడ మీద ఫిర్యాదును అతికించి వచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగార్ధులు తగిన మార్కులు వచ్చినా ఉద్యోగాలు ఇవ్వక పోవడం ఏమిటి అని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే జీవో 46 తెచ్చినప్పటికీ.. మళ్లీ గెలిస్తే రద్దు చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ జీవో 46ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇపుడు వెనక్కి పోవడం ఏమిటి? అని ప్రశ్నించారు. అనేక చట్టాలు మార్చుకుంటున్నప్పుడు జీవోలు మార్చుకుంటే తప్పు ఏమిటి అని అన్నారు. ఎన్నికల కోడ్ పేరిట అన్నిటినీ కాంగ్రెస్ సర్కార్ వాయిదా వేసిందన్నారు. ఇప్పుడు కోడ్ ముగిసినా ప్రభుత్వం ఏ ఎన్నికల హామీని నెరవేర్చడం లేదని విమర్శించారు. నిరుద్యోగుల కోసం విడుదల చేస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు

Tags:    

Similar News